-
కేటీఆర్తో భేటీ అయిన మాల సామాజికవర్గ ప్రతినిధులు
-
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యమని స్పష్టీకరణ
-
ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఉప ఎన్నికలో తమ బలాన్ని చాటుకుంటామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తామని మాల సామాజికవర్గ నేతలు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయిన తర్వాత ఈ నాయకులు ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మాల సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే తాము రాజకీయంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.
“కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా, మా ఐక్యతతో ఓడించి తీరుతాం. మా బలం ఏంటో కాంగ్రెస్ పార్టీకి రుచి చూపిస్తాం” అని మాల నేతలు గట్టిగా చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను పోటీలో నిలబెడతామని వారు ప్రకటించారు. కేటీఆర్తో జరిగిన సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల అమలు తీరుపై వివరంగా చర్చించినట్లు వారు వివరించారు.
Read also : StockMarket : భారత స్టాక్ మార్కెట్లలో లాభాలకు అడ్డుకట్ట
